Indiramma House updates: హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని పేద ప్రజల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారికి అనువైన ప్రాంతాల్లోనే స్థలాలను గుర్తించి గృహ నిర్మాణ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు.
Read Also:Hyderabad transport project: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. నగర వాసులకు ఊరట
ఇందిరమ్మ ఇళ్లు మరియు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా, కేవలం అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు అందేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడకూడదని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ సహకారం తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
22 వేల ఇళ్లకు తక్షణమే కరెంటు మీటర్లు
నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సంబంధించి మంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న టవర్లు మొత్తం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, పూర్తయిన ఇళ్లను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించారు. సుమారు 22 వేల ఇళ్లకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, కాలనీల్లోని వాణిజ్య సముదాయాలను అద్దెకు ఇవ్వకుండా వేలం పద్ధతిలో విక్రయించాలని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం మరియు స్థానిక సొసైటీ జాయింట్ అకౌంట్లో జమ చేయాలని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ మరియు నాలుగు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: