ఫార్ములా ఈ రేసు నిర్వహణలో అవినీతిపై వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోమవారం ఏసీబీ (ACB) అధికారుల ముందు హాజరయ్యారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. విచారణ సందర్భంగా ఆయన సెల్ఫోన్ను స్వాధీనం చేసేందుకు అధికారులు ప్రయత్నించారు.అయితే విచారణకు తన ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ అధికారులకు తెలిపారు. దాంతో, ఈ నెల 18లోగా ఫార్ములా ఈ రేసు సమయంలో ఉపయోగించిన ఫోన్లను సమర్పించాలని ఏసీబీ ఆదేశించింది.
విచారణ తర్వాత మీడియా ముందు ప్రత్యక్షమైన కేటీఆర్
విచారణ అనంతరం కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్కి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఫార్ములా ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరాను. కానీ సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధం కాలేదు. లై డిటెక్టర్ పరీక్షకైనా నేను సిద్ధమని చెప్పాను. కానీ ఎలాంటి స్పందన రాలేదు అని కేటీఆర్ విమర్శించారు.
ఏసీబీపై తీవ్ర విమర్శలు – రాసిచ్చిన ప్రశ్నలే అడిగారు
ఏసీబీ విచారణపై కూడా కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఉదయం నుంచి ఒకే ప్రశ్న పదే పదే అడుగుతున్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో నేనే వారిని అడగాల్సి వచ్చింది అని ఆరోపించారు.రేవంత్ రెడ్డి జైలు నుంచి వచ్చారని గుర్తుచేస్తూ, ఇప్పుడు తమను జైలుకెళ్లేలా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. నన్ను జైలులో పెడితే విశ్రాంతి తీసుకుంటాను. కేసులు పెడితే వెరవను. ప్రజలు తీర్పు చెప్పే రోజు త్వరలో వస్తుంది, అని వ్యాఖ్యానించారు.ఫార్ములా ఈ కేసు విచారణతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కేటీఆర్ వ్యాఖ్యలు, ఏసీబీ తీరుపై వచ్చిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
Read Also : Aamir Khan : పాకిస్థాన్ షరతులపై ఆమీర్ ఖాన్ ఏమన్నారంటే