హైదరాబాద్ నగరంలో ప్రజలు రోజువారీ ట్రాఫిక్ భారం నుండి తప్పించుకోడానికి మెట్రో రైలును ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. వాహనాల రద్దీ, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, పెరుగుతున్న ఇంధన ధరలు ముఖ్యంగా వేసవిలో ఎయిర్ కండీషన్ వాహనాల్లో ప్రయాణించడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో మెట్రో ట్రావెల్ను ప్రజలు తక్కువ ఖర్చుతో, ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రోజుకు సగటున 4 లక్షల మందికి పైగా ప్రయాణికులను సేవలందిస్తోంది.
నష్టాల్లో మెట్రో ఇప్పుడు ఛార్జీల పెంపే మార్గమా?
మహమ్మారి తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు తీవ్రంగా నష్టపోయాయి. అదే తరహాలో హైదరాబాద్ మెట్రోనూ కరోనా కాలం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. మెట్రోను నిర్వహిస్తున్న సంస్థ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.6,500 కోట్ల నష్టాల గురించి వెల్లడించింది. ఈ నష్టాలను తగ్గించేందుకు మరియు ఆపరేషనల్ ఖర్చులు, మైన్టెనెన్స్ను మెరుగుపరచేందుకు ఛార్జీల పెంపు తప్పదని సంస్థ భావిస్తోంది.
ఛార్జీల పెంపు కోసం చేపట్టిన చర్యలు
ఇప్పటికే 2022లోనే ఎల్ అండ్ టీ ప్రభుత్వం వద్ద ఛార్జీల పెంపు అనుమతి కోరింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 2002 ప్రకారం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలు, ప్రస్తుత ఛార్జీలు, ఆర్థిక లాభనష్టాలు అన్నీ పరిశీలించిన తరువాత ఛార్జీల పెంపును అంగీకరించింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో పెంపును అమలు చేయలేదు.
ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, మెట్రో సంస్థ మరోసారి ఛార్జీల పెంపు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. భారీ నష్టాలను చూపిస్తూ, ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వం ఈసారి ఛార్జీల పెంపుకు అనుమతి ఇచ్చే అవకాశముంది. ఈ ప్రక్రియ త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది. ఇటీవల బెంగళూరు మెట్రో తన ఛార్జీలను సుమారు 44 శాతం వరకూ పెంచింది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రయాణ ధరల పెంపు తప్పదనే వాదనకు ఇది బలంగా నిలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఛార్జీలు కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.60 లుగా ఉన్నాయి.
Read also: KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు