హైదరాబాద్(Hyderabad)లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ(Turkey)కి చెందిన యూనస్ ఎమ్ర్రే ఇన్స్టిట్యూట్తో చేసిన విద్యా సంబంధిత అవగాహన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు టర్కీ మద్దతు ఇస్తోందన్న కారణంతో, ఈ ఒప్పందాన్ని కొనసాగించడం సమంజసం కాదని వర్సిటీ నిర్ణయించింది.
టర్కీకి చెందిన యూనస్ ఎమ్ర్రే ఇన్స్టిట్యూట్ మధ్య ఐదేళ్ల అవగాహన ఒప్పందం
ఈ ఏడాది జనవరి 2వ తేదీన మానూ మరియు టర్కీకి చెందిన యూనస్ ఎమ్ర్రే ఇన్స్టిట్యూట్ మధ్య ఐదేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ఆధారంగా మానూలోని లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్ & ఇండాలజీ విభాగంలో టర్కిష్ భాషలో డిప్లొమా కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సు బోధన కోసం టర్కీ నుంచి ఒక విజిటింగ్ ప్రొఫెసర్ను కూడా నియమించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ ప్రొఫెసర్ ఇప్పటికే స్వదేశానికి తిరిగిపోయినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
దేశ భద్రతకు వ్యతిరేకంగా ఉన్న అంశాల్లో భాగస్వామ్యం ఉండకూడదు
ఈ ఒప్పందం రద్దుతో టర్కీ సంస్థతో మౌలానా ఆజాద్ వర్సిటీకి ఉన్న విద్యా సంబంధాలు పూర్తిగా ముగిసినట్లు స్పష్టమైంది. దేశ భద్రతకు వ్యతిరేకంగా ఉన్న అంశాల్లో భాగస్వామ్యం ఉండకూడదన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ స్పష్టం చేసింది. ఈ చర్యపై విద్యా వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కానీ పాక్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో సంబంధాలు తెంచుకోవడం అవసరమనే అభిప్రాయాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
Read Also : HYD-Metro : హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నెటిజన్ల ఫైర్