హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, నగర పరిధిలో సొంత స్థలం ఉండాలనే సామాన్యుల కల రోజురోజుకూ ఖరీదైనదిగా మారుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర హౌసింగ్ బోర్డు తాజాగా నిర్వహించిన బహిరంగ వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలో ఉన్న 14 ఖాళీ ప్లాట్లను విక్రయానికి పెట్టగా, కొనుగోలుదారులు పోటీపడి మరీ వీటిని దక్కించుకున్నారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ.32,000 కనిష్ట ధరగా నిర్ణయించగా, వేలంలో అది ఏకంగా రూ.51,000 వరకు పలకడం గమనార్హం. కేవలం 14 ప్లాట్ల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు రూ.14.75 కోట్ల భారీ ఆదాయం సమకూరింది, ఇది నగర శివార్లలో కూడా భూమికి ఉన్న విపరీతమైన డిమాండ్ను ప్రతిబింబిస్తోంది.
హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ నేతృత్వంలో జరిగిన ఈ వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగింది. సగటున ఒక్కో గజం రూ.44,285 ధర పలకడం విశేషం. ప్రైవేట్ వెంచర్లతో పోలిస్తే ప్రభుత్వ లేఅవుట్లలో భూమి కొనుగోలు చేస్తే ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవనే నమ్మకంతోనే కొనుగోలుదారులు ఇంత భారీ ధర వెచ్చించడానికి మొగ్గు చూపుతున్నారు. లక్ష్మీగూడలో దక్కిన ఈ అనూహ్య స్పందనతో హౌసింగ్ బోర్డు అధికారులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ వేలంలో అతి తక్కువ ధర కూడా రూ.36,000గా నమోదు కావడం చూస్తుంటే, నగరం నలుమూలలా భూముల విలువలు ఆకాశాన్నంటుతున్నాయని స్పష్టమవుతోంది.
Robot dog controversy : ఇండియా ఏఐ సమ్మిట్లో రోబో వివాదం, అసలు నిజం ఏమిటి?
ఇదే ఊపుతో హౌసింగ్ బోర్డు తదుపరి దశ వేలానికి సిద్ధమైంది. ఈనెల 23వ తేదీన గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట, లింగంపల్లి వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లను వేలం వేయనున్నారు. ముఖ్యంగా భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద మరియు గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఉన్న ప్లాట్లపై రియల్టర్లు కన్నేశారు. ఈ ప్రాంతాలు సాఫ్ట్వేర్ కారిడార్కు దగ్గరగా ఉండటంతో ఇక్కడ వేలం పాటలు సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ఆసక్తి గల వారు వేలం రోజు ఉదయం నాటికి డీడీ చెల్లించి పాల్గొనవచ్చని అధికారులు సూచించడంతో, ఈ నెల 23న జరగబోయే వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com