Theater Parking Fee: పార్కింగ్ ఫీజు వసూలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Read Time:  1 min
Theater Parking Fee: పార్కింగ్ ఫీజు వసూలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
FONT SIZE
GET APP

Theater Parking Fee: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు న్యాయస్థానంలో పెద్ద ఉపశమనం లభించింది. థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు నిలిపివేస్తూ గతంలో వచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. పార్కింగ్ ఫీజు వసూలు నిలిపివేత ఆదేశాలు కేవలం ఒక్క థియేటర్‌కే పరిమితమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో యథావిధిగా పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఏర్పడింది.

Read Also: Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురి బలి

జీవో 121 విశిష్టత

సాధారణంగా మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాళ్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదనే నిబంధన ఉంది. అయితే, సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వీటికి మినహాయింపునిస్తూ జీవో 121ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు పార్కింగ్ ఫీజు విధించే వెసులుబాటు పొందుతున్నాయి.  ఈ జీవోను సవాలు చేస్తూ ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏ మున్సిపల్ ప్రాంతంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ఆదేశించారు. ఈ ఆదేశాలు థియేటర్ యజమానులకు పెద్ద దెబ్బగా మారాయి. దీంతో సుదర్శన్ 35ఎంఎం, ఆర్‌ఆర్‌ సినీ ఎంటర్‌ప్రైజెస్‌ వంటి థియేటర్ యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి.

High Court gives green signal for collection of parking fee
High Court gives green signal for collection of parking fee

కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ప్రతివాదుల తరపు న్యాయవాదులు కీలక పాయింట్‌ను కోర్టు దృష్టికి తెచ్చారు. అసలు పిటిషన్‌లో కేవలం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్‌ థియేటర్‌ను మాత్రమే ప్రతివాదిగా చేర్చారని,

కానీ సింగిల్ జడ్జి ఉత్తర్వులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు వర్తింపజేయడం సరికాదని వాదించారు.వాదనలు విన్న ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కేవలం కోణార్క్‌ థియేటర్‌కే పరిమితం చేస్తూ తీర్పునిచ్చింది. అంటే, కోణార్క్‌ థియేటర్ మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిబంధనల ప్రకారం పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.