తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ (SIT) అధికారులు మాజీ మంత్రి హరీశ్ రావును సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సుమారు 7 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు పాత్ర ఏమిటి? నిఘా పరికరాల కొనుగోలు లేదా సమాచార సేకరణలో ఆయనకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ పొడవునా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతన గల సమాధానాలు ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Finance: కోలుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానా
హరీశ్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన విచారణకు హాజరవుతున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా ఈ కేసులో పోలీసు అధికారులు, ఇంటిలిజెన్స్ విభాగం నేతలను విచారించిన సిట్, ఇప్పుడు నేరుగా రాజకీయ ప్రముఖులపై దృష్టి సారించడం చర్చనీయాంశమైంది. ఈ విచారణ ప్రక్రియ కేవలం ప్రాథమిక సమాచారం కోసమా లేక హరీశ్ రావును నిందితుడిగా చేర్చే అవకాశం ఉందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విచారణ ముగిసిన అనంతరం హరీశ్ రావు నేరుగా తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడి, లోపల జరిగిన విచారణ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసులో తమను రాజకీయంగా వేధించేందుకే ప్రభుత్వం ఇలాంటి విచారణలు చేస్తోందని మొదటి నుంచీ బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో హరీశ్ రావు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? సిట్ అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందన ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఒకవేళ ఆయన ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందిస్తే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com