బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సోమవారం అనారోగ్యానికి లోనయ్యారు. ఉన్నట్టుండి జ్వరం, అలసట బాధించడంతో ఆయనను కుటుంబ సభ్యులు బేగంపేటలోని కిమ్స్ హాస్పటల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.ఫార్ములా ఈ-రేస్ కేసు క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోమవారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడేందుకు హరీశ్ రావుతో కలిసి సమావేశానికి వచ్చారు. అయితే అప్పటికే హరీశ్ జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
మీడియా సమావేశం మధ్యలోనే అస్వస్థత
మీడియా సమావేశం మొదలైన కొన్ని నిమిషాల్లోనే హరీశ్ ఆరోగ్యం మరింత దెబ్బతింది. బహుశా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల మరింత అలసట వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిస్థితిని గమనించిన కేటీఆర్ సమావేశం మధ్యలోనే ముగించి, హరీశ్ రావును పంపించేశారు.
వెంటనే హాస్పటల్కి తరలింపు
అనారోగ్యం విషయంలో ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు వెంటనే హరీశ్ను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు తదితర ఆరోగ్య వివరాలను పరిశీలిస్తున్నారు. చికిత్స కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.హరీశ్ రావు అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కిమ్స్ వద్దకు చేరుకున్నారు. పలువురు నేతలు, ఎమ్మెల్యేలు కూడా అతని ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకోవడానికి ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం హరీశ్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Read Also : KTR : జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటానన్న కేటీఆర్