Group-1 నియామకాల ప్రక్రియకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఏప్రిల్ 17న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ హైకోర్టు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ 20 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని, అయితే నియామకాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.అంతకుముందు, సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేయాలని టీఎస్పీఎస్సీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సీజే ధర్మాసనం ఈ అంశంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టంచేసి, విచారణను సింగిల్ బెంచ్ వద్దనే కొనసాగించాలని సూచించింది. గురువారం, శుక్రవారం రోజుల్లో సింగిల్ బెంచ్ ముందు విచారణ కొనసాగింది. అయితే గురువారం వాదనలు పూర్తి కాకపోవడంతో శుక్రవారం మరోసారి వాదనలు వినిపించారు.
Group-1 : గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్
పిటిషనర్ల తరపున న్యాయవాది రచనా రెడ్డి, టీఎస్పీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు సమర్పించారు. రీకౌంటింగ్లో ఒక అభ్యర్థికి 60 మార్కులు తగ్గినట్లు రచనా రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన న్యాయమూర్తి, ఆ అభ్యర్థికి సంబంధించిన పత్రాలు కోర్టులో సమర్పించాలని టీఎస్పీఎస్సీకి ఆదేశించారు. తదుపరి విచారణలో పత్రాలు సమర్పిస్తామని టీఎస్పీఎస్సీ న్యాయవాది హామీ ఇచ్చారు.డివిజన్ బెంచ్ వేసవిలో స్టేపై నిర్ణయం తీసుకోవాలని సూచించిన విషయాన్ని టీఎస్పీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే న్యాయమూర్తి రాజేశ్వరరావు, వేలాది అభ్యర్థుల భవితవ్యానికి సంబంధించి కేసు కావడంతో తొందరపడొద్దని, ఒత్తిడి చేయవద్దని హెచ్చరించారు. చివరగా, తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసారు. అంతవరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
Read More : Bilawal Bhutto: ఉగ్రవాదులతో తమ సంబంధం నిజమే: బిలావల్ భుట్టో