హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాంతం హైదరాబాద్కు ఊపిరితిత్తుల్లా మారిందని, అయితే ప్రస్తుతం జరుగుతున్న భూసేకరణ, నిర్మాణ పనుల వల్ల ప్రకృతి సంపద నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పర్యావరణానికి ముప్పుగా మారుతాయని ఆయన హెచ్చరించారు.

కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఈ అంశంపై మాట్లాడుతూ.. “హైదరాబాద్కి ఊపిరితిత్తుల లాంటి 400 ఎకరాలను నాశనం చేయడం గ్రీన్ మర్డర్ చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్లు, జేసీబీలు లోపలికి చొచ్చుకెళుతుంటే నెమళ్లు సాయం కోసం రోదిస్తున్నాయి,” అని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడటానికి ప్రభుత్వాలు ముందుండాల్సిన అవసరం ఉందని, అయితే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనానికి దారితీస్తోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ మౌనంపై కూడా ప్రస్తావించారు. “ఇప్పటికీ రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ గురించి చింతించకుండా అభివృద్ధి పేరుతో నాశనం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ విధానాలు మరింత అనుకూలంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితిని చూస్తే, హెచ్సీయూ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిపోతుందనే భయం ప్రజల్లో పెరుగుతోంది. యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు జీవ వైవిధ్యానికి ఆవాసంగా మారి ఉండగా, అభివృద్ధి పేరిట వాటిని నాశనం చేయడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని, పర్యావరణాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.