హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు 9,844 గ్రామాలలో విజయవంతంగా గ్రామ సభల నిర్వహణ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. బుధవారం జరిగిన గ్రామసభలు- 3888 కాగా.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 10 లక్షల 9 వేల 131 దరఖాస్తులు వచ్చాయి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం వచ్చిన దరఖాస్తులు 59,882 గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అటు గ్రామ సభల్లో గొడవల పై ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని రేషన్ కార్డుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్య క్తం చేస్తోంది. గ్రామ సభల్లో సమస్యలను తెలుసుకున్న ఉత్తమ్… ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తు న్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైనవారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్.
మొత్తం 47,413 కొత్త దరఖాస్తులు అందగా, కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డుల జారీపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దరఖాస్తులు తీసుకుంటున్నా రేషన్ కార్డులు అందించడం లేదని, గతంలో దరఖాస్తు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అనర్హులతో లబ్ధిదారుల జాబితాను రూపొందించారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై గ్రామసభల్లో అధికారులు స్పందించి, పథకాలకు అర్హుల లిస్టును ప్రజలకు చదివి వినిపించారు. సభల్లో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
కాగా, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల కోసం ఈ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభలు జనవరి 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలను అధికారుల వద్ద పెట్టారు. పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంపై ప్రజలు అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, మంగళవారం 3,410 పంచాయతీల పరిధిలో ఈ సభలు నిర్వహించారు. లిస్టులో పేర్లు లేకపోయిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.