తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ పథకం అమలు కోసం అవసరమైన భారీ నిధులను సమకూర్చుకునేందుకు బహిరంగ మార్కెట్ నుండి సుమారు రూ. 9,000 కోట్ల రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి ఇండెంట్ పంపింది. 13 ఏళ్ల నుండి 27 ఏళ్ల వరకు వేర్వేరు కాలపరిమితులతో ఈ రుణాన్ని సేకరించనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన జరగనున్న ఆర్బీఐ ఈ-వేలం ద్వారా ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి.
Jagityala: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మిర్యాలగూడ పర్యటనలో రైతు భరోసా నిధుల పంపిణీపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ నగదును జమ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా సిద్ధమైందని, నిధులు అందగానే ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో రుణాన్ని కేవలం రైతు భరోసా కోసమే సేకరించడం, అన్నదాతల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం రైతు భరోసా మాత్రమే కాకుండా, వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం గుర్తుచేశారు. ఇప్పటికే రూ. 21,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, అర్హత ఉన్న ప్రతి రైతుకూ సంక్షేమ ఫలాలు అందజేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమకావడం ఖాయంగా కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com