హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి రద్దీగల ప్రధాన రైల్వే స్టేషన్లపై భారం తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేసింది. రూ.430 కోట్ల వ్యయంతో 9 ప్లాట్ఫారాలు, 19 ట్రాక్లతో నిర్మించిన ఈ టెర్మినల్ను 2025 జనవరిలో ప్రారంభించారు. ఎస్కలేటర్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, కెఫెటేరియా వంటి అనేక సదుపాయాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన చర్లపల్లి స్టేషన్కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
TGSRTC కీలక నిర్ణయం
ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGS RTC) కీలక చర్యలు చేపట్టింది. చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అలాగే మెహిదీపట్నం, బోరబండ, ఉప్పల్, కోఠి, అఫ్జల్గంజ్ తదితర ప్రాంతాలకు వెళ్లే సిటీ బస్సుల సంఖ్యను కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైళ్ల సమయానికి అనుగుణంగా బస్సు సేవలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సూపర్వైజర్లను కూడా నియమించినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
చర్లపల్లి టెర్మినల్ నుంచి 13 జంక్షన్ల రైళ్లు
ప్రస్తుతం చర్లపల్లి టెర్మినల్ నుంచి 13 జంక్షన్ల రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే మరో 12 కొత్త రైళ్లు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ స్టేషన్ నుంచి చెన్నై సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12603/04), ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ (18045/46), గోరఖ్పూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12589/90) వంటి కీలక రైళ్లు నడుస్తున్నాయి. తాజా రవాణా ఏర్పాట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకోసం ప్రధాన కేంద్రంగా మారబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.