తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ కేసులపై ఎక్సైజ్ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలు ఇప్పుడు నేరస్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో వరుసగా శిక్షలు పడుతుండటంతో నిందితుల్లో భయం పెరుగుతోంది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ శిక్షలు నమోదవుతున్నాయి. ఈ ఘటనలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.సాధారణంగా ఎక్సైజ్ శాఖ అంటే మద్యం అమ్మకాలు, అక్రమ మద్యం తయారీపై దృష్టి పెడుతుంది అనే అభిప్రాయం ఉంది. కానీ, ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ వంటి ప్రత్యేక టీమ్లను ఏర్పాటుచేసి గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులపై దాడులు ముమ్మరం చేస్తున్నది. వి.బి. కమలాసనరెడ్డి ఎక్సైజ్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేసుల నమోదుతోపాటు నిందితులకు శిక్షలు ఖచ్చితంగా పడేలా చర్యలు తీసుకుంటున్నారు.2024లో మాత్రమే 1162 ఎన్డీపీఎస్ కేసులు నమోదవ్వగా, 6400 కేజీల గంజాయి, 683.81 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్ను పట్టుకున్న ఎక్సైజ్ శాఖ తన సత్తా చాటింది. అలాగే ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ మల్కాజిగిరి, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో కూడా శిక్షల నమోదు వేగవంతమవుతోంది. సంగారెడ్డిలో 6 కేసుల్లో శిక్షలు పడగా, మెదక్లో 10 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి.
ఈ దాడుల భాగంగా ఒడిశా నుంచి హైదరాబాద్కు హషీష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్షలు విధించడం గమనార్హం. అలాగే సంగారెడ్డిలో అద్దెంకి సంగప్పా అనే నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించారు. ఇదే జిల్లాలో గత రెండు మూడు నెలల్లో వరుసగా 6 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి.ఈ చర్యలతో గంజాయి, డ్రగ్స్ వ్యాపారం నిర్వహించాలనే అక్రమార్కుల్లో భయం ఏర్పడింది. ఎక్సైజ్ శాఖ, పోలీస్ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, పంచనామా, చార్జీషీట్లు బలంగా ఉండటం వల్ల కేసుల్లో విజయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపడం ఈ విజయాల్లో కీలకమైంది.శిక్షలు ఖచ్చితంగా పడే స్థితి ఏర్పడటంతో నేరాల రేటు తగ్గే అవకాశం ఉంది. ఇది గంజాయి, డ్రగ్స్ వ్యాపారాలపై కీలక ప్రభావం చూపనుంది. ఇకపై ఎక్సైజ్ శాఖ ఈ దాడులను మరింత ఉధృతం చేస్తూ, నేరస్తులకు గుణపాఠం చెబుతుందని అధికారులు తెలిపారు.
Read More : Florida University: ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం