Gadwal Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ దుర్ఘటనలో ఒక విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన విద్యార్థి విగతజీవిగా మారడంతో గద్వాల పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Read Also: Peddapalli Road Accident: కారు అదుపుతప్పి దంపతుల దుర్మరణం!
రైలు ఆలస్యం కావడంతో బయటకు వచ్చి..
పోలీసుల సమాచారం ప్రకారం.. అయిజకు చెందిన రాము (17), మిట్టదొడ్డికి చెందిన విష్ణు (17), గంజిపేటకు చెందిన వర్ధన్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. వీరు పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు గద్వాల రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అయితే, వారు వెళ్లాల్సిన రైలు ఆలస్యం కావడంతో, ఆ సమయాన్ని గడపడానికి ముగ్గురు కలిసి ఒకే బైక్పై స్టేషన్ నుండి బయటకు వచ్చారు.
రైల్వే స్టేషన్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. విష్ణు పరిస్థితి విషమంగా ఉండగా, వర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి.
Gadwal Road Accident: కర్నూలు ఆసుపత్రికి తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
న్యాయం చేయాలంటూ రాస్తారోకో
ప్రమాదంలో మృతి చెందిన రాము కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీనివల్ల ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని నిరసనకారులు భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: