Gadwal Crime News: మంగళవాయిద్యాల హోరుతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు రోదనలు మిన్నంటుతున్నాయి. కొత్త జీవితంపై వేల ఆశలతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లికి కొద్దిరోజుల ముందే తనువు చాలించింది. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది. అనుమానం అనే పెనుభూతం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
Read Also: Raghurama Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS సునీల్ నాయక్ అరెస్ట్
కాబోయే భర్త అనుమానం.. వేధింపులే శాపమై!
వివరాల్లోకి వెళితే.. కేటీదొడ్డి మండలం పరిధిలోని చింతలకుంట గ్రామంకు చెందిన స్నేహ (19)కు అదే మండలంలోని యువకుడు హరికృష్ణతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి నిశ్చయం అనంతరం ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కొంతకాలంగా హరికృష్ణ.. స్నేహ క్యారెక్టర్పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫోన్ ద్వారా తరచూ వేధిస్తున్నట్లు తెలిసింది. ఎక్కడికి వెళ్లావ్.. ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్..? ఫలానా అబ్బాయిని నీకు ఎలా పరిచయం.. అతడికి నీకు ఉన్న సంబంధం ఏంటి..? అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవాడు.
ఇదే విషయాన్ని స్నేహ తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు వరుడి పెద్దలతో మాట్లాడారు. ఆ సమయంలో హరికృష్ణ శివ మాలలో ఉండటంతో అది పూర్తయ్యాక మాట్లాడి సమస్యను పరిష్కరిద్దామని పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.కానీ ఈ నెల 18న మళ్లీ ఫోన్ చేసిన హరికృష్ణ.. స్నేహతో అసభ్యంగా మాట్లాడి ఆమెను వేధించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్నేహ ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యువతి తల్లి మహేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హరికృష్ణను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. హరికృష్ణ వేధింపుల వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: