గచ్చిబౌలిలో రికార్డు స్థాయి ధర పలుకుతున్న భూమి హౌసింగ్ బోర్డు స్థలాలకు డిమాండ్
హైదరాబాద్: రాజధాని పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డుకు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతం లోని ఒక కమర్షియల్ ప్లాట్ను ఏకంగా రూ.33 కోట్లకు కొనుగోలు చేయడానికి ముందుకు రాగా, మరో చోట రూ. 13.51 కోట్లు పలికింది. రెండు ఎంఐజి ప్లాట్లను కూడా సుమారు 4.50 కోట్లకు పైగా వెచ్చించి బహిరంగ ‘వేలంలో దక్కించుకోడానికి పోటీపడ్డారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ప్లాట్లను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. మొత్తం 11 ప్లాట్లను వేలం వేయగా రూ.65.02 కోట్ల మేర ఆదాయం వచ్చిందని హౌజింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌజింగ్ కమిషనర్ వి.పి.గౌతం తెలిపారు.
ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించినా అధికారులు
నగరంలోని చింతల్, గచ్చిబౌలి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్లాట్లకు సోమవారం నాడు హౌజింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. చింతల్ ప్రాంతంలో 266 చదరపు గజాల విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ప్లాట్లు, గచ్చిబౌలి ప్రాంతంలో కమర్షియల్ ప్లాట్లు, నిజాంపేటలో 413 చదరపు గజాల ప్లాట్లు వీటిలో ఉన్నాయి. కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీ కమ్యూనిటీ హాల్ లో నిర్వించిన ఈ స్థలాల వేలం పాటలో 55 మంది పాల్గొన్నారని హౌజింగ్ కమిషనర్ పేర్కొన్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో 3271 చదరపు గజాల భూములు, చింతల్ ప్రాంతంలో 799.98 చదరపు గజాలు, నిజాంపేటలో 1653 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేలం వేయగా రూ.65.02 కోట్లు బోర్డుకు ఆదాయంగా వచ్చింది. గచ్చిబౌలి హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న 1487 గజాల కమర్షియల్ ల్యాండ్ ను గజానికి రూ.2.22 లక్షలు చొప్పున సుమారు రూ.33 కోట్లకు కొనుగోలు చేశారు.
ఈ భూములకు చదరపుగజానికి 1.20 లక్షలను ఆఫ్సెట్ ధరగా నిర్ధారించగా వేలం పాటలో అది 2.22 లక్షలు పలికింది. అట్లాగే ఇదే ప్రాంతంలోని 1200 గజాల పాఠశాలభూములకు ఆఫ్ సెట్ ధర చదరపు గజానికి 80 వేలుగా నిర్ధారించగా, వేలంలో ఆ భూములకు రూ. 1.12 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే ఇక్కడి రెండు ఎంఐజి ప్లాట్లు చదరపు గజం రూ.1.86 లక్షలు, రూ.1.32 లక్షల ధరలు పలికాయి. ఒక్క గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించిన భూముల ద్వారానే రూ.55 కోట్ల 56 లక్షల 84 వేలు ఆదాయం హౌజింగ్ బోర్డుకు సమకూరింది. కుత్బు ల్లాపూర్ మండలంలోని చింతల్ ప్రాంతంలోని హౌజింగ్ బోర్డు ఎంఐజి ప్లాట్లు కూడా అత్యధిక ధరలతో బహిరంగ వేలంలో అమ్ముడు పోయాయి. ఈ ప్రాంతంలో మొత్తం 10 ప్లాట్లను వేలం వేయగా, వీటిలో ప్లాట్ నెం.113,114,115ల ద్వారానే సుమారు రూ.8.11 కోట్లమేర ఆదాయంవచ్చింది. నిజాం పేట బాచుపల్లిలోని 4 ప్లాట్లను సుమారు రూ.70 లక్షలకు వేలం పాటలో కొనుగోలు చేశారు.
Read also: Rythu Bharosa : నేడు ‘రైతు భరోసా’ సంబరాలు – మంత్రి పొంగులేటి