శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు మంత్రి కొండా సురేఖ మంచి శుభవార్త చెప్పారు. ప్రముఖ ఆలయాల్లో ఉపవాసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
మహా శివరాత్రి: శివునికి అత్యంత ఇష్టమైన రోజు మహా శివరాత్రి ఈ పర్వదినాన భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రానుంది. భక్తిశ్రద్ధలతో ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణలతో రోజంతా గడుపుతారు. ఆ రోజున శివక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. దీంతో అన్ని శైవక్షేత్రాల్లో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ మంగళవారం (ఫిబ్రవరి 11) సెక్రటేరియట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వేములవాడలో ఏర్పాట్లు:
శివరాత్రి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ శ్రీ రాజారాజేశ్వర ఆలయంకు భక్తులు ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది కావున అక్కడ అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంకు భక్తులు భారీగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వేయి స్థంబాల గుడి వద్ద:
రామప్ప, మేళ్లచెరువు, పానగళ్లు, ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారు, పాలకుర్తి, వేయి స్తంభాల గుడి, భద్రకాళి, కాశీబుగ్గ తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయశాఖ అధికారులతో చర్చించారు.
ఆలయాల దగ్గర మద్యం అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా క్యూ మానేజ్మెంట్,మంచి నీటివసతి,ట్రాఫిక్ క్రమబద్దీకరణ,వాహనాల పార్కింగ్, అన్ని ప్రదేశాల్లో లైట్లు,తాత్కాలిక మరుగుదొడ్లు,మరియు వివిధ అంశాలపై అధికారులకు సురేఖ పలు సూచనలు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను సమన్వయం చేసేందుకు హైదరాబాద్లో ఎండోమెంట్ కమిషనరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి, ఇతర నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా నదీ హారతి కార్యక్రమం చేపట్టాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. క్కడా ఎలాంటి పొరపాట్లకు లేకుండా, పటిష్ఠ చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు.