Latest News: Singareni – తొలిసారిగా సింగరేణిలో మహిళలకు అవకాశం.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

Read Time:  1 min
Singareni
Singareni
FONT SIZE
GET APP

సింగరేణి సంస్థ (Singareni Institute) తన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు భారీ యంత్రాల నిర్వహణలో కేవలం పురుషులకే అవకాశం కల్పించిన ఈ సంస్థ, తొలిసారిగా ఓపెన్‌కాస్ట్ (ఓఎంసీ) మైన్స్‌లో మహిళలను ఆపరేటర్లుగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. బొగ్గు ఉత్పత్తిలో ఓఎంసీల ప్రాధాన్యం అపారమని తెలిసిందే. ఈ ప్రాజెక్టుల ద్వారా బొగ్గును భారీ యంత్రాల సహాయంతో వెలికితీయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మెషిన్లను నడపడానికి స్త్రీలకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా సింగరేణి ఒక చారిత్రాత్మక అడుగు వేస్తోంది.

శనివారం ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. ఎంపికైన వారు ఓఎంసీల్లోని భారీ యంత్రాలను నడపడం, నిర్వహించడం వంటి బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. సుమారు 135 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు కంపెనీ (Singareni Coal Company) కి ఇది ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ రంగంలో పురుషులే ఆధిపత్యం చెలాయిస్తుంటే, ఇప్పుడు మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించబడుతున్నాయి.

కేవలం మగ వారు మాత్రమే పని చేస్తున్నారు

ఓఎంసీల నుంచే దాదాపు 70 శాతం బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఓఎంసీ మెషిన్ల మీద కేవలం మగ వారు మాత్రమే పని చేస్తున్నారు. ఈ అంశంపై కొన్ని రోజుల క్రితం సింగరేణి ఎండీ బలరాం మహిళా కార్మికుల (women workers) తో చర్చించారు. అయితే వీరిలో కొందరు మహిళలు ఓఎంసీ ఆపరేటర్లుగా పని చేసేందుకు ఆసక్తి చూపినట్లు.. చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆసక్తి ఉన్న మహిళా ఉద్యోగులను ఆపరేటర్లుగా నియమించేందుకు ముందుకు వచ్చారు.ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా మైన్స్, డిపార్ట్‌మెంట్లలో కలిపి దాదాపు 2,120 మంది వరకు మహిళా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.

Singareni

మెషీన్ ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం

వీరిలో 600-800 మంది వరకు మహిళలు ప్రొడక్షన్ విభాగంలో పని చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఒక మైన్‌లో పూర్తిగా మహిళా కార్మికులతో ఒక షిఫ్ట్‌ని నడుపుతున్నారు. ఇది విజయవంతం అయితే మరో మైన్‌లో కూడా మహిళలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓఎంసీలో మెషీన్ ఆపరేటర్లుగా మహిళలకు అవకాశం ఇచ్చేందుకు సీఎండీ (CMD) శ్రీకారం చుట్టారు.ఓఎంసీ మైన్లలో మహిళా ఆపరేటర్లుగా నియమించేందుకుగాను అవసరమైన సర్క్యులర్‌ని.. సింగరేణిలోని అన్ని ఏరియాల్లోకి పంపించారు.

ఓఎంసీ మెషిన్ ఆపరేటర్లుగా మహిళా జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు అవకాశం కల్పించబోతన్నారు. భారీ యంత్రాల మీద ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన మహిళా ఉద్యోగులు అప్లై చేసుకోవాలంటూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణిలో జనరల్ అసిస్టెంట్, బదిలీ వర్కర్లుగా పని చేస్తూ.. 35 ఏళ్ల లోపు వయసున్న వారు అప్లై చేసుకోవడానికి అర్హులని తెలిపారు.

తాము పని చేస్తున్న ఏరియాలోని మైన్ మేనేజర్

అలానే దరఖాస్తు చేసుకునే వారు ఏడవ తరగతి పాస్ అయి ఉండాలని సూచించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యం కలిగి ఉండటే కాక.. టూ, ఫోర్ వీలర్ రెండింటిలో ఏదైన ఒక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. 2024 ఆగస్టుకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.ఓఎంసీల్లో మెషిన్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న మహిళా జనరల్ అసిస్టెంట్లు,

బదిలీ వర్కర్లు తాము పని చేస్తున్న ఏరియాలోని మైన్ మేనేజర్,ఏరియా జీఎం ఆఫీస్‌లో అప్లై చేసుకోవాలి. ఈ దరఖాస్తులను చీఫ్ ప్లానింగ్ ప్రాజెక్ట్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. వీరిలో కనీస అర్హతలు ఉన్న అభ్యర్థులను సెలక్ట్ చేయనుంది. ఇలా ఎంపిక చేసిన వారిని సిరిసిల్లాలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థ హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో శిక్షణకు పంపుతారు. అనంతరం వారి ప్రతిభ ఆధారంగా విధుల్లోకి తీసుకుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/key-government-discussions-on-private-educational-institutions-shutdown/telangana/547429/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.