హైదరాబాద్ (Hyderabad) మహానగరంపై కురుస్తున్న అతివృష్టి వర్షాలు నగర రహదారులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉస్మాన్సాగర్ నుంచి భారీగా నీటి విడుదల జరగడంతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రభావం మూసారాంబాగ్ బ్రిడ్జిపై స్పష్టంగా కనిపిస్తోంది. అంబర్పేట పరిసరాల్లోని మూసారాంబాగ్ వంతెన(Moosarambagh Bridge)పై వరదనీరు పోటెత్తడంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దిల్సుఖ్నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త వంతెన వైపు మళ్లిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. పాతబస్తీ, బండ్లగూడ, పటేల్నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటితోపాటు మురుగు నీరు కొన్ని ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జంట జలాశయాల్లోకి భారీగా వరద – గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అవి నిండుకుండలా మారడంతో జలమండలి అధికారులు వరద నియంత్రణ చర్యలు చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఉస్మాన్సాగర్ 11 గేట్లు ఏడడుగుల మేర ఎత్తి 7,986 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. హిమాయత్సాగర్లో ఆరు గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని విడదల చేశారు. ఈ కారణంగా మూసీ నది ప్రవాహం మరింత ఉద్ధృతమై నార్సింగి – మంచిరేవుల రహదారులపై నీరు పోటెత్తింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు జారీ చేశారు.

ప్రభుత్వ అప్రమత్తత – ప్రజలకు జాగ్రత్తలు
మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసానగర్, శంకర్నగర్ జలమయమయ్యాయి. దాదాపు వంద ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. అప్జల్గంజ్ శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో నివసిస్తున్న 55 కుటుంబాలను కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్రెడ్డి వరద పరిస్థితిపై సమీక్షలు చేస్తూ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే రెండు రోజులపాటు జలమండలి ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం వరద పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు పునరావృతంగా సూచిస్తున్నారు.