తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భయానక బస్సు ప్రమాదం సంభవించింది. విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘విహారి ట్రావెల్స్’కు చెందిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఆ సమయంలో హైదరాబాద్ వైపుకు ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా వెనుక భాగంలో పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కకు ఆపాడు. ఆ సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. కొన్ని క్షణాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది.
Bomb Blast : ఢిల్లీలో జరిగిన మేజర్ బాంబు దాడులు ఇవే !!
సాక్షుల సమాచారం ప్రకారం, మంటలు చెలరేగిన వెంటనే భయాందోళన చెందిన ప్రయాణికులు అరుస్తూ బయటపడేందుకు ప్రాణాలు పణంగా పెట్టారు. కొందరికి స్వల్ప గాయాలు అయినప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు మంటల్లో చిక్కుకోవడానికి కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఇంజిన్ వైర్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఇటీవలే కర్నూలు జిల్లాలో వీ. కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనమవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఆ ఘటన షాక్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే మరోసారి ఇలాంటి ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. బస్సు సాంకేతిక సమస్యలు, భద్రతా ప్రమాణాల లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్పై పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, వాహనాల నిర్వహణ, సర్వీసింగ్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/