హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో ఉన్న గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం ఒక విషాదాన్ని మిగిల్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో తక్కువ సమయంలోనే అవి మొత్తం బిల్డింగ్ను చుట్టుముట్టాయి. బిల్డింగ్ నిండా పొగ అలుముకోవడంతో శ్వాస అందక పలువురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
మరణించిన బాధితుల వివరాలు:
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధృవీకరించారు. శ్వాస ఆడక, మంటల నుంచి బయట పడలేక వారు మృతి చెందారు. మరణించినవారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. వారి పేర్లు ఇలా ఉన్నాయి. ఆరుషి జైన్ (17), షీతల్ జైన్ (37), సుమిత్ర (65), మున్ని బాయి (72), ప్రథమ్ (13), అభిషేక్ మోడీ (30), రాజేంద్ర కుమార్ (67), ఇరాజ్ (2), ఫ్రియాన్షి (6), హర్షలి గుప్తా (7), ఇదిక్కి (4), అన్య (3), పంకజ్ (36), వర్ష (35), రజని అగర్వాల్ (32), రిషభ్ (4), ప్రీతం అగర్వాల్ (1)గా గుర్తించారు.
ప్రభుత్వ స్పందన:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు తక్షణ సహాయాన్ని ప్రకటించనున్నారు. ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశించడంతోపాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read also: Revanth Reddy: అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన మృతులకు సీఎం రేవంత్ దిగ్భ్రాంతి