తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందనను పొందింది. ఇప్పటివరకు అందుతున్న గణాంకాల ప్రకారం ఈ పథకం ఒక గ్రాండ్ సక్సెస్గా నిలిచింది. గతంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన దొడ్డు బియ్యం నాణ్యతలోనూ, రుచి విషయంలోనూ ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోవడం వల్ల ఎక్కువమంది దాన్ని తీసుకోలేదు. కానీ ఏప్రిల్ నుండి ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ వల్ల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఏప్రిల్ 17వ తేదీ నాటికి 91.19 శాతం (1,52,710 టన్నులు) పంపిణీ పూర్తవడం దీనికి నిదర్శనంగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం
రాష్ట్రవ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం 1,67,285 టన్నుల బియ్యాన్ని కేటాయించింది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు 68 వేల టన్నుల పంపిణీ పూర్తవడం వల్ల ప్రజల్లో ఈ పథకం పట్ల ఉన్న ఆదరణ స్పష్టమవుతుంది. గతంలో రేషన్ బియ్యాన్ని తీసుకోని వారు కూడా ఈసారి ముందుకొచ్చి సన్నబియ్యాన్ని తీసుకోవడం, పలు ప్రాంతాల్లో బియ్యం లభించగానే వెంటనే అయిపోవడం వంటి పరిణామాలు ప్రజలలో ఈ పథకం పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. దీని వల్ల అక్రమ రవాణాకు అవకాశం తక్కువైందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి ప్రజల మద్దతు
ఈ పథకంతో పాటు ప్రభుత్వానికి ప్రజల మద్దతు మరింత పెరిగిందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. నాణ్యమైన బియ్యం అందించడం వల్ల బ్లాక్ మార్కెట్ దళారుల దుశ్చర్యలు తగ్గాయి. రేషన్ డీలర్లు డిమాండ్ను తీర్చేందుకు రెండుసార్లు, మూడుసార్లు స్టాక్ పాయింట్లకు వెళ్లాల్సి రావడం పథకం విజయాన్ని చాటుతోంది. ఈ నేపథ్యంలో సన్నబియ్యం పథకాన్ని నిరంతరంగా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. అటు అధికారులు కూడా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని చర్యలు తీసుకుంటున్నారు.