నిజామాబాద్ జిల్లా గిరిరాజ్ కళాశాల మైదానంలో నేటి నుండి మూడు రోజుల పాటు రైతు మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో రైతులకు అవసరమైన సాంకేతిక పద్ధతులు, పంటల నిర్వహణ, ఉత్పత్తి మెరుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ రంగాన్ని పురోగతిపథంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించనున్నారు. రైతుల సమస్యలపై చర్చలు, అవగాహన సదస్సులు, ఎగ్జిబిషన్లు, వ్యవసాయ పరికరాల ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు ఈ మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. పంటల బీమా, రుణాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై నిపుణులు వివరాలు అందించనున్నారు.
ఈ కార్యక్రమం రైతుల సమస్యలకు పరిష్కార మార్గం
రాష్ట్రవ్యాప్తంగా నుండి పెద్ద సంఖ్యలో రైతులు హాజరవ్వనున్నారు. ఈ మహోత్సవం ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడమే కాక, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకుంటారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అభ్యున్నతికి ఈ మహోత్సవం మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.