జగిత్యాల మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడినట్లు కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా స్థానిక కాంగ్రెస్ నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలికేలా అధిష్ఠానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయడమే కాకుండా, మొదటి నుండి పార్టీ కోసం కష్టపడి జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని పార్టీ పెద్దలు తీర్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగారు.
Revanth reddy: రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు..
ఈ రాజకీయ వివాదాన్ని చక్కదిద్దేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఏఐసీసీ కార్యదర్శి సవాంగ్ చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ మరియు జీవన్ రెడ్డిలతో విడివిడిగా మాట్లాడి, పార్టీ ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. ఛైర్మన్ ఎంపిక విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, వర్గ విభేదాలకు తావు లేకుండా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని నచ్చజెప్పారు. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా, పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా హైడ్రామాను తలపించాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన మద్దతుదారులుగా ఉన్న 23 మంది కౌన్సిలర్లతో కలిసి రహస్య క్యాంప్ ఏర్పాటు చేయగా, అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 14 మంది కౌన్సిలర్లతో హైదరాబాద్ చేరుకుని తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఇరు వర్గాలు ఎవరికి వారు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. అయితే, రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం మరియు ఎన్నిక నేపథ్యంలో అధిష్ఠానం జోక్యం చేసుకోవడం, ఇరు వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో రేపటి ఎన్నిక కేవలం అధికారిక ప్రక్రియగానే మిగిలిపోయే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com