తెలంగాణ రాష్ట్రంలో తాజాగా గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు. “మీకు దీపావళి మరో రెండు రోజుల తర్వాత కాదు, 48 గంటల ముందుగానే వచ్చింది” అని ఆయన చిరునవ్వుతో అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఈ నియామకాలు కేవలం ఉద్యోగావకాశాలు మాత్రమే కాదని, తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త దిశ చూపించే అడుగులని పేర్కొన్నారు. “యువతకు అవకాశాలు ఇవ్వకపోతే రాష్ట్రం ముందుకు సాగదు. మీరు ప్రజల సేవకు నిబద్ధతతో పనిచేయాలి” అని సూచించారు.
Latest News: GST: జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది: కేంద్ర మంత్రి నిర్మలా
ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గత పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. “సౌలక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయింది. ప్రజల డబ్బుతో నిర్మించిన ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పాడుబడిపోయింది. కారణం — ఆ నాయకుల దురాశ, కుటుంబపరమైన ఆలోచనలే” అని అన్నారు. ఆయన మాట్లాడుతూ, “గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తెలంగాణ ప్రజల కలలను మోసం చేశారు. వారు కేవలం తమ కుటుంబాల కోసం పాలన సాగించారు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తన ఫామ్హౌస్లో ఎకరా పంట వేసి కోటి రూపాయల ఆదాయం వస్తోందని చెప్పిన పెద్దాయన, ఆ వ్యవసాయ విద్యను ప్రజలకు ఎందుకు నేర్పలేదు?” అంటూ మాజీ పాలకుడిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సభలో చప్పట్లు మార్మోగాయి. “మేము ఆ సొంత ప్రయోజనాల రాజకీయాన్ని కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే పాలనను కొనసాగిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు ప్రజా సేవ ధ్యేయంగా పని చేస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, “ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన విజయదీపావళి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/