హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు.
గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను ధర్మాసనం జతచేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్ను.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది. పాత పిటిషన్తో కలిపి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేస్తామని చెబుతూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ వేసిన పిటిషన్పై రెండు రోజుల క్రితం సుప్రీంలో విచారణ జరుగగా.. సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడాన్ని తప్పుపట్టింది. ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో గట్టిగా ప్రశ్నించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేదాకనా అని క్వశ్చన్ చేసింది. స్పీకర్కు ఎంత సమయం కావాలో మీరే కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని.. పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.