255 పోస్టులకు 3,500పైగా దరఖాస్తులు
హైదరాబాద్: దేవాదాయ ధర్మాదాయ శాఖ మంజూరు చేసిన దూప దీప నైవేద్యం పథకం (Dhoopa Deepa Naivedya Scheme)లోని పోస్టులకుభారీగా పోటీ నెలకొంది. మంజూరు చేసిన 255 పోస్టులకు పోటాపోటీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు చివరి నాటికి ఎండోమెంట్ కార్యాలయానికి దాదాపు 3,500 పైగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 600, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 300 పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిని పరిశీలించి దూప దీప నైవేద్యం పథకానికి అర్హత కలిగిన ఆలయాలను ఎంపిక చేసేందుకు ఎండోమెంట్ అధికారులు (Endowment Officers) కసరత్తు మొదలుపెట్టారు.

255 పోస్టులు మంజూరు
ఇప్పటికే ఏ జిల్లా నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో వాటిని జిల్లాల వారీగా విభజించారు. అర్హులను గుర్తించే ప్రక్రియను త్వరలో చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు బోనాల ఉత్సవాలు ఉండటంతో పరిశీలనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. ఉత్సవాలు ముగియగానే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ అవి దూపదీప నైవేద్యానికి నోచడం లేదు. వాటికి ఏళ్ల నాటి చరిత్ర ఉన్నా నిర్వహణ లేక అవి శిథిలావస్థకు చేరాయి. విశిష్టత కలిగిన ఆలయాలను గుర్తించి నిత్యం పూజలు నిర్వహించేందుకు అర్చకులకు కనీస వేతనం, ఆలయాల నిర్వహణకు కనీస ఖర్చుల కింద ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తుంది. ఆలయ పూజారికి రూ.6 వేల (Rs. 6 thousand to the temple priest) చొప్పున, ఆలయ నిర్వహణకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ.10వేల పూజారి(పంతులు) ఖాతాలో జమ చేయనుంది. నెలకు రూ.10 వేల చొప్పున అందజేయడమే దూప దీప నైవేద్యం పథకం (Dhoopa Deepa Naivedya Scheme) కింద ఎంపికైనట్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దూప దీప నైవేద్యం పథకంలో 255 పోస్టులు మంజూరు చేసింది. అర్హులైన వారు ఈ పోస్టులకు జూన్ 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. వీటి కోసం వివిధ ఆలయాల్లో పూజలు చేస్తున్న అర్చకులు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,500 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించేందుకు ఎండోమెంట్ ఉన్నతాధికారులు సర్వం సిద్ధమయ్యారు. ప్రభుత్వం మంజూరు చేసిన 255 పోస్టులు పరిమిత సంఖ్యలో ఉండటంతో అర్చకుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది.
జిల్లాకు 7 పోస్టులు
తాజాగా 33 జిల్లాల ప్రకారం చూస్తే జిల్లాకు 6 నుంచి 7 పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. ఈ లెక్కన అర్చకులను ఎంపిక చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంపిక విధానంలో అన్ని పరిగణనలోకి అంశాలను తీసుకుంటూ జాబితాను రూపొందించనున్నారు. దూప దీప నైవేధ్యం పథకానికి ఎంపిక చేసే ఆలయానికి కొన్ని నిబంధనలు పెట్టారు. ముందుగా ఆ ఆలయం ఎండోమెంట్ లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఆలయానికి ఐదెకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతర ఆదాయం పొంది ఉండకూడదు. ఆ గుడి విశిష్టత, ఆలయ చరిత్ర కలిగి ఉండాలి. అప్పుడే ఆ ఆలయం దూప దీప నైవేద్యం పథకం పరిధిలోకి వస్తుంది. దీనిని ఎంపిక చేయాలంటే ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ నివేదిక, ఈవో(ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) ధ్రువీకరణ, అసిస్టెంట్ కమిషన్ ప్రతిపాదన అనంతరం అడిషనల్ కలెక్టర్ ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన ఈ జాబితాను ఎండోమెంట్ కమిషనర్ ధ్రువీకరించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆమోదం కోసం పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. అప్పటి నుంచి ఆ ఆలయాలు దూప దీప నైవేద్యం పథకం పరిధిలోకి వస్తాయి నెలనెలా రూ.10 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: PG Entrance Exams: ఆగస్టు 4 నుంచి కామన్ పిజి ఎంట్రన్స్ పరీక్షలు