CP Sajjanar Warning: సాధారణంగా ప్రేమ పేరుతో జరిగే మోసాల గురించి మనం వింటుంటాం. కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. వివాహం నిశ్చయమైన తర్వాత కూడా యువతులు, వారి తల్లిదండ్రులు అపరిచితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Read Also: Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్ను ఢీకొట్టిన కంటైనర్!
ముందుగా సంప్రదాయం.. ఆపై ఎమోషనల్ బ్లాక్మెయిల్!
మోసగాళ్లు ఇప్పుడు తమ పంథాను మార్చుకున్నారని సీపీ సజ్జనార్ వివరించారు. తొలుత ఎంతో పద్ధతిగా పెళ్లి చూపులకు రావడం, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిపించుకోవడం వంటివి చేసి నమ్మకం కలిగిస్తున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా చేసుకుని, యువతులతో సన్నిహితంగా మెలగడం, మాయమాటలతో వారిని శారీరకంగా లోబరుచుకోవడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు..
తీరా పెళ్లి సమయం దగ్గర పడ్డాక, తమ అసలు రంగును బయటపెడుతూ… అదనపు కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తన ట్వీట్లో పేర్కొన్నారు.అయితే, సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. బాధితుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని ఈ కేటుగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారని షీ టీమ్స్ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నిశ్చితార్థం అయినంత మాత్రాన గుడ్డిగా నమ్మకుండా, అబ్బాయి ప్రవర్తన, అతని స్నేహితులు, అతని అలవాట్లపై ముందే ఆరా తీయాలని సూచించారు.
ముఖ్యంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేస్తే, అది కచ్చితంగా ప్రమాద సంకేతమని గ్రహించాలని హెచ్చరించారు.ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు భయపడకుండా ముందుకు రావాలని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసానిచ్చారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు గానీ, లేదా అత్యవసరంగా డయల్ 100కు గానీ సమాచారం అందించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: