రైతు బంధును రద్దు చేయాలని కాంగ్రెస్ చూస్తుంది : హరీశ్ రావు

Read Time:  1 min
Congress wants to abolish Rythu Bandhu. Harish Rao
Congress wants to abolish Rythu Bandhu. Harish Rao
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంద్‌ పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. రైతుబంధు కంటే సన్నరకం ధాన్యానికిచ్చే రూ.500 బోనసే మేలని రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని విమర్శించారు.

రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ.26 కోట్లు మాత్రమేనని చెప్పారు. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. . రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోందని, వారికి రైతుబంధు శాశ్వతంగా ఎగ్గొట్టడానికి చూస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపించారు. కాగా, రైతులకు బోనస్ సైతం పూర్తిగా చెల్లించలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

రైతు భరోసా వస్తదని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా అని ప్రశ్నించారు. రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి అని నిలదీశారు. మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.