Congress vs BRS: తెలంగాణ శాసనసభ వేదికగా మహిళా సంఘాల వడ్డీలేని రుణాల అంశంపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ముదురుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు రికార్డు స్థాయిలో నిధులు ఇచ్చామని ప్రభుత్వం గాంకాలను విడుదల చేయగా, అవన్నీ తప్పుడు లెక్కలంటూ బీఆర్ఎస్ సవాల్ విసురుతోంది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో అసలు వాస్తవాలేమిటనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్త మహిళా సంఘాల్లో హాట్ టాపిక్గా మారింది.
Read Also:Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2026: సామాన్యుడికి భారం తీరనున్నదా?

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, డిసెంబర్ 2023 నుండి మార్చి 2026 వరకు మహిళా సంఘాలకు రూ. 57,937.2 కోట్ల భారీ మొత్తాన్ని రుణాల రూపంలో అందజేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు రూ. 45,491 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ. 12,445 కోట్లు కేటాయించారు. మహిళలను ‘కోటీశ్వరులను’ చేయాలనే లక్ష్యంతో ఏటా రుణాల పరిమితిని పెంచుకుంటూ వెళ్తున్నామని, 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా రూ. 27,557 కోట్లు పంపిణీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
కేటీఆర్ రాజీనామా సవాల్తో వేడెక్కిన రాజకీయం
అయితే, ఈ గణాంకాలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న రూ. 57 వేల కోట్ల లెక్క అబద్ధమని, నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. కేవలం రూ. 5 లక్షల లోపు రుణాలకే వడ్డీ రాయితీ ఇస్తూ, అంతకు మించిన రుణాలకు వడ్డీలు వసూలు చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం తప్పుడు అంకెలతో కాలం వెళ్లదీస్తోందని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ. 3,000 కోట్ల వడ్డీ బకాయిలను చెల్లించకుండా మోసం చేసిందని మంత్రి సీతక్క ఎదురుదాడికి దిగారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1,390 కోట్ల వడ్డీలను మహిళల తరపున చెల్లించిందని వెల్లడించారు. గతంలో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే వడ్డీ లేని రుణాలను రూ. 5 లక్షలకే పరిమితం చేశారని, ఇప్పుడు దాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆమె మండిపడ్డారు. భవిష్యత్తులో ఈ పరిమితిని పెంచే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: