Congress: తెలంగాణ కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ లో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించి, షెడ్యూల్-9 లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద 12 బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మహాధర్నాకు హాజరు కావాలంటూ ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలతో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల నేతలు ఇప్పటి సమాచారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీల్లోని బీసీ నేతలంతా ధర్నాలో పాల్గొనేందుకు హస్తినకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే రేపు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ , ఏఐసీసీ నేతలు పాల్గొననున్నట్లుగా సమాచారం. కాగా, ఏప్రిల్ 2,3 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారంతో వివిధ పార్టీ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు కు మద్దతును తెలంగాణ కాంగ్రెస్ బృందం కోరనుంది.