హైదరాబాద్: మొంథా తుపాను(Montha Cyclone) కారణంగా ప్రభావితమైన జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టంపై కలెక్టర్లు సీఎంకు వివరించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరద సాయం పొందే అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.
Read Also: Visa: వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు..బాంబ్ పేల్చిన ట్రంప్
ధాన్యం సేకరణ, రిపోర్టులపై సీఎం ఆదేశాలు
ధాన్యం కొనుగోళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాళ్లకు తరలించాలని సూచించారు. పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు సూచనలు చేయాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని నియమించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్కు రిపోర్టు చేరాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షణ, జాగ్రత్తలు
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేసి పర్యటించేలా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ను మళ్లించాలని సూచించారు. వరంగల్లో అవసరమైతే హైడ్రా(Hydra) సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
వరద సహాయక చర్యలు, ఏరియల్ సర్వే
వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల నేడు వరంగల్ పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: