CM : ముగిసిన సిఎం రేవంత్ జపాన్ పర్యటన: పెట్టుబడులు రూ. 12,062 కోట్లు, ఉద్యోగాలు 30,500
ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, ఏప్రిల్ 22: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో “తెలంగాణ రైజింగ్” ప్రతినిధి బృందం చేపట్టిన జపాన్ పర్యటన మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. బుధవారం ఉదయం సిఎం రేవంత్ రెడ్డి జపాన్ నుండి హైదరాబాద్కు తిరిగిరానున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వం రూ. 12,062 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమే కాక, దాదాపు 30,500 ఉద్యోగావకాశాలను కల్పించగలిగింది.హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రాజెక్టులలో భాగంగా మారుబెని కంపెనీతో భాగస్వామ్యం కుదిరింది. వారు నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడానికి ప్రారంభంగా రూ. 1,000 కోట్లు, మొత్తం రూ. 5,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. ఈ పార్క్ ద్వారా సుమారు 30,000 ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.అంతేకాక, ఎన్టీటీ డేటా మరియు నెయిసా సంస్థలు హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ను స్థాపించేందుకు రూ. 10,500 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్నాయి.

జపాన్లో “జయ జయహే తెలంగాణ” గీతం
ఇంకా, రుద్రారంలో తోషిబా ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా వారు విద్యుత్ పరికరాలు తయారీ ఫ్యాక్టరీ కోసం రూ. 562 కోట్ల పెట్టుబడిని ప్రకటించారు. అదనంగా, రాజ్ గ్రూప్ జపాన్లో 500 ఉద్యోగ నియామకాలకు ఒప్పందం కుదిర్చింది.ఈ పర్యటనలో ఓ ప్రత్యేక సంఘటనగా, జపాన్ దేశంలోని హిరోషిమా నగరంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమం నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ముందు హర్షిణి (8వ తరగతి) మరియు హరిణి (7వ తరగతి) అనే ఇద్దరు తెలుగు చిన్నారులు “జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం” గీతాన్ని ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. వారి తల్లిదండ్రులతో కలిసి సీఎంకు స్వాగతం పలికారు. వారు స్వయంగా గీసిన పెన్సిల్ స్కెచ్ పెయింటింగ్స్ను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భాన్ని సీఎం గర్వంగా గుర్తు చేసుకున్నారు.
Read More : kaleshwaram: రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ