తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) తీవ్రంగా స్పందించారు. నెల చివరికి వచ్చి పోతున్నా, రాష్ట్రంలోని హోంగార్డులకు ఇప్పటివరకు జీతాలు చెల్లించకపోవడాన్ని ఆయన ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, “హోంగార్డుల ఆవేదన వినిపించడంలేదా?” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, మహబూబ్నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు జీతాలు రాకపోవడాన్ని ఆయన సిగ్గుచేటుగా అభివర్ణించారు.
ఆర్ధిక ఇబ్బందుల్లో హోంగార్డులు
చిన్న జీతాలపై ఆధారపడే హోంగార్డులు జీతాలు రాకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు తెలిపారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బ్యాంకు ఈఎంఐలు చెల్లించకపోవడంతో అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్నారని చెప్పారు. సాధారణ జీవనంలోనే కష్టపడుతున్న హోంగార్డులు ఈ విధంగా నిర్లక్ష్యం ఎదుర్కొనడం బాధాకరమన్నారు.
ప్రతి నెలా ఇదే తంతు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావొచ్చినా, ప్రతి నెలా హోంగార్డుల జీతాల్లో ఈ తరహా ఆలస్యం జరుగుతూనే ఉందని హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతల్లో కార్యాచరణ కనిపించడం లేదని విమర్శించారు. ప్రత్యేకించి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం కార్యాలయంలోనే ఈ పరిస్థితి ఉంటే, వీరి సమస్య ఎవరిద్వారా పరిష్కారం పొందాలంటూ ప్రశ్నించారు. వెంటనే జీతాలు విడుదల చేసి, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also : Raai Laxmi : రాయ్ లక్ష్మి ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా?