మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని ఉదయం నుంచీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని, మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. దీనితో అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.అంజనాదేవి అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఉన్న తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారని వార్తలు వచ్చాయి. అధికారులతో జరగాల్సిన సమీక్షలు, అనేక కార్యక్రమాలను పవన్ రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అంజనాదేవి ఆరోగ్యం విషయంలో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు.
చిరంజీవి టీమ్ క్లారిటీ
అయితే, ఈ వార్తలపై చిరంజీవి టీమ్ అధికారికంగా స్పందించింది. అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆమె ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీలేవని, కేవలం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లారని వెల్లడించారు. గత వారం ఆమె కొన్ని రెగ్యులర్ చెకప్లు చేయించుకున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఇటీవలే ఆమె పుట్టినరోజును చిరంజీవి కుటుంబం ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
రెగ్యులర్ చెకప్
అయితే అంజనా దేవి రెగ్యులర్ చెకప్ కోసం హాస్పటల్ కు వెళ్లినట్టు పీఆర్ టీమ్ తెలిపింది. అంజనాదేవికి అస్వస్థత అనే వార్తలు ఒక్కసారిగా రావడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఆమె కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పటల్ కు వెళ్లారు అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్.