సైదాబాద్ జువెనైల్ హోంలో లైంగికదాడి కలకలం – బాధితుల సంఖ్య పెరుగుతోంది
హైదరాబాద్లోని సైదాబాద్ బాలుర జువెనైల్ హోమ్లో జరిగిన లైంగిక దాడి కేసు నెమ్మదిగా ఆందోళనకర విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. హోంలో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్న రహమాన్ అనే వ్యక్తి బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన, సెలవులపై ఇంటికి వెళ్లిన ఒక బాలుడు తల్లిదండ్రులకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
ప్రారంభంగా 11 మంది బాలురు రహమాన్ చేతుల మీదుగా లైంగిక(Child Abuse) దాడికి గురైనట్లు అధికారులు గుర్తించారు. తాజా విచారణలో మరింత దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. మరో ఆరుగురు బాలురూ రహమాన్ బాధితులైనట్లు తేలడంతో, బాధితుల సంఖ్య 18కి పెరిగింది. హోంలో ప్రస్తుతం ఉన్న బాలురే కాక, గతంలో విడుదలైన బాలలపైనా దాడులు జరిగే అవకాశముందని అనుమానంతో, అధికారులు వారి నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు.
Read also: ఎట్టకేలకు మెహుల్ ఛోక్సీని అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్
ఐదు పోక్సో కేసులు నమోదు – మరిన్ని ఆరోపణల దిశగా దర్యాప్తు
ఇప్పటికే రహమాన్పై రెండు పోక్సో (POCSO) చట్టం ప్రకారం కేసులు నమోదయ్యాయి. అయితే తాజా ఫిర్యాదులతో కలిపి మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. పోలీసుల అనుమానాలను బలపరిచే విధంగా, సీసీ కెమెరా ఫుటేజ్లను స్వాధీనం చేసుకుని లోతైన విచారణ చేస్తున్నారు. బాధిత బాలల నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు.
రహమాన్ గత కొన్ని నెలలుగా బాలులను బెదిరించి లైంగిక (Child Abuse) వేధింపులకు పాల్పడ్డట్లు స్పష్టమైంది. దాడులు ఎదుర్కొన్న బాలుర బాధనీ, హింసను విన్న పోలీసులు కూడా మానసికంగా కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రహమాన్ చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నాడు. అతన్ని కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేయాలన్న దిశగా న్యాయ అనుమతికి పోలీసులు దరఖాస్తు చేశారు.