Telangana: తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు చేసింది. అయితే.. అప్పటివరకు ఎంపిక అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా, గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాదాపు 20 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ షిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు.. తుది విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది.

గ్రూపు-1పై రాజకీయ రచ్చ
మరోవైపు.. గతకొన్ని రోజులుగా గ్రూపు-1పై రాజకీయ రచ్చ నడుస్తోంది. గ్రూప్-1 పరీక్షపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూపు-1 నియామకాల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు. పరీక్ష రాయని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పరీక్షను వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. ఇలా కౌశిక్రెడ్డితో పాటు మరికొందరు విపక్ష నేతలు సైతం గ్రూపు-1పై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన టీజీపీఎస్సీ.. ఆరోపణలను ఖండించింది. కొందరు దురుద్దేశంతోనే గ్రూపు-1 పరీక్షపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ మండిపడింది. ప్రొటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు తెలిపింది.