తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘనంగా ప్రశంసల వర్షం కురిపించారు. నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని మాచారం గ్రామంలో జరిగిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ పథకం ఒక్క అభివృద్ధి కార్యక్రమమే కాకుండా, దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచే అంశమని పేర్కొన్నారు.
నాయకత్వ ఆలోచనల ప్రతిబింబం
దేశ చరిత్రలోనే ఇదొక గొప్ప కార్యక్రమం. జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల నినాదాలను ఈ ప్రభుత్వం చట్టంగా మారుస్తోంది. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వామిని కావడం నా జన్మ ధన్యమైంది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవని, వజ్రం లాంటి ఆయన మనసులోంచి ఈ పథకం పుట్టిందని పేర్కొన్నారు. ఒకప్పుడు భూమి కోసం ఈ గడ్డపై ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.
పోరాటాల నుంచి చట్టాల దిశగా
భట్టి మాట్లాడుతూ, గిరిజనులు, అటవీ ప్రజల హక్కులు, భూములు, నీటి వనరుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలు ఇప్పుడు ఫలిస్తుండటం గర్వకారణమని తెలిపారు. ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలి. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయి. వారికి కేవలం భూములే కాకుండా, వాటిని సాగు యోగ్యం చేసుకునేందుకు అవసరమైన నిధులను కూడా అందిస్తున్నాం అని భట్టి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పైసాను ప్రజల కోసమే ఖర్చు చేస్తుందని, నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సంపద సృష్టన & పంపిణీ – కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని భట్టి తెలిపారు. ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న అనవసర విమర్శలను కుట్రలుగానే పరిగణిస్తామని అన్నారు. సంపదను సృష్టిస్తాం, సృష్టించిన సంపదను పేదలకు పంచుతాం. ఇదే మా నినాదం అని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజనులకు నమ్మకం కలిగించే ప్రయత్నం జరుగుతోందని భట్టి చెప్పారు. ఆత్మగౌరవంతో జీవించే గిరిజన సమాజాన్ని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇది కేవలం ఓ పథకం కాదు, జీవన విధానాన్ని మార్చే ఉద్యమం అని వ్యాఖ్యానించారు.
Read also: KTR: గుల్జార్హౌస్ అగ్ని ప్రమాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు