Asaduddin Owaisi : జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రమూకల దాడిని ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను చంపడం దుర్మార్గమైన చర్య అన్నారు. టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రానికి సూచించారు. కాగా, మంగళవారం అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఆందోళన
మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు. కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు టూరిస్టులను అక్కడినుంచి తరలించారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అమర్నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు ఈ మార్గంలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ
ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది టూరిస్ట్లు మరణించగా.. మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఆరా తీస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడిన ప్రధాని మోడీ కాశ్మీర్ వెళ్లాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.
Read Also: MLC Elections : ఈరోజే పోలింగ్