ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్ (Gudihatnur) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదం అంతటా కలకలం రేపింది. ఆసుపత్రి అంటే ఆరోగ్యానికి నిలయంగా ఉండాలి. కానీ అదే ఆసుపత్రిలో ఓ పసికందు నిద్రలో ఉన్నపుడే ఆమె బెడ్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన ఘటన స్థానికులను ఆవేదనకు గురిచేసింది. అదృష్టవశాత్తు తల్లి అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన పసికందు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండురోజుల పసి కందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఇంతలోనే తల్లి అప్రమత్తం కావడంతో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. ఫ్యాన్ ఊడిపడే సమయంలో బాలింత తన బిడ్డను రెప్పపాటులో ఒళ్లోకి తీసుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది.
రెండు రోజుల క్రితం గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ పాయల్ పురిటి నొప్పులతో ఇబ్బంది పడటంతో భర్త జాదవ్ కైలాష్ గుడిహథ్నూర్ ప్రాథమిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొన్ని గంటల్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది పాయల్. తల్లిబిడ్డలిద్దరు జనరల్ వార్డ్ లో చికిత్స పొందుతుండగా ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వారి బెడ్ పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ హఠాత్పరిణామానికి భయభ్రాంతులకు గురైన తల్లి పాయల్ అంతే వేగంగా తన బిడ్డను పక్కకు లాగడంతో ఫ్యాన్ చివరి భాగం వీపుపై పడింది.
ఆసుపత్రి సిబ్బంది స్పందన
అలర్ట్ అయిన గుడిహత్నూర్ ఆస్పత్రి సిబ్బంది తల్లిబిడ్డలనిద్దరిని మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయితే మా బిడ్డ బతికి ఉండేది కాదేమో. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక భద్రత కూడా లేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.
Read also: Hyderabad: ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య