కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంశంలో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీ వ్యవహారశైలిపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ తీరుపై ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి వారిని కాపాడే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నదంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్ర మంత్రుల విమర్శల్ని గుర్తు చేసిన ఆది శ్రీనివాస్
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని, అందులో భారీ అవినీతి జరిగిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో విమర్శించారని ఆయన గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం?
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య ఇటీవల జరిగిన రహస్య భేటీపై కూడా ఆది శ్రీనివాస్ గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య జరిగిన సమావేశం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోందని అన్నారు. గతంలో తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండటం ఆ రెండు పార్టీల మధ్య బంధం బలపడుతోందనడానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల ఆధారంగా చూస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందా? ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నాయని మేము ఎప్పటినుంచో చెబుతున్నాం అని ఆది శ్రీనివాస్ అన్నారు.
ఈటల రాజేందర్ వైఖరిపై విమర్శ
గతంలో “కేసీఆర్ రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేసిన ఈటల రాజేందర్ “మరి ఇప్పుడు మంత్రివర్గం నిర్ణయం ప్రకారమే ప్రాజెక్టు నిర్మించారని ఈటల ఎందుకు అంటున్నారు? బీజేపీ గతంలో చేసిన ఆరోపణలపై ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకుంది?” అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం విషయంలో బీజేపీ నిజాయతీగా వ్యవహరించాలని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం అవినీతి – ప్రశ్నల వర్షం
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పలు కఠినమైన ప్రశ్నలతో బీజేపీని నిలదీశారు ఆది శ్రీనివాస్. డీపీఆర్కు భిన్నంగా మేడిగడ్డ ప్రాజెక్టును ఐదు కిలోమీటర్ల దూరం ఎందుకు జరిపారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంచనా వ్యయాన్ని రూ.30 వేల కోట్ల నుంచి ఏకంగా లక్ష కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు. కాళేశ్వరం అవినీతి ఆరోపణల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బయటపడేసేందుకే బీజేపీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతిని ప్రజల ముందుంచే బాధ్యత బీజేపీదని, ఇప్పటికే వచ్చిన ఆరోపణలపై సరైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
Read also: Phone Tapping Case : రేపు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు