హైదరాబాద్ నగర శివార్లలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత శేషసాయి కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఈ మంటలు పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి విస్తరించాయి. దాంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. ఈ ప్రమాదానికి రసాయనాలు ప్రధాన కారణమని, వాటి వల్ల ఘాటైన పొగ వెలువడిందని అధికారులు చెబుతున్నారు. స్థానికులు ఆ పొగలను పీల్చడంతో శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా లేనా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివిధ అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజిన్లు రప్పించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రసాయనాల కారణంగా మంటలు విపరీతంగా వ్యాపించడంతో వాటిని అదుపు చేయడంలో కొంత కష్టం ఏర్పడింది.
పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళం సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను తదుపరి దర్యాప్తులో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం అప్రమత్తంగా ఉంది. మంటల ప్రభావం మరింత పెరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదం మరోసారి రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తింది.