తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న 14 గ్రామాలపై మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) దృష్టి సారించింది. ఈ గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవన్కులే ప్రకటించారు. ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న రజురా, జివాటి తాలూకాల పరిధిలో ఉండే గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా మహారాష్ట్రలో విలీనాన్ని కోరుతూ వినతులు చేస్తున్నారని చెప్పారు.
జమాబందీ రికార్డులు MHకు అనుకూలంగా ఉన్నాయని వివరాలు
మహారాష్ట్ర మంత్రి ప్రకారం, ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన 14 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు (జమాబందీ) కూడా మహారాష్ట్ర రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నట్లు తేలిందని తెలిపారు. ఈ ఆధారాలతో పాటు గ్రామ ప్రజలను పరిగణనలోకి తీసుకొని వీటిని చంద్రపూర్ జిల్లాలో కలిపేందుకు చర్యలు ప్రారంభించామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని ప్రక్రియలు ప్రారంభమైనట్లు మంత్రి బవన్కులే పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ స్పందన కోసం ఉత్కంఠ
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర సమగ్రతకు భంగం కలిగించేలా మహారాష్ట్ర తీసుకుంటున్న ఈ చర్యపై అధికారిక స్థాయిలో ఇంకా తెలంగాణ ప్రభుత్వ ప్రతిస్పందన రాలేదు. ప్రాంతీయత, భౌగోళిక సరిహద్దులు, ప్రజల అభిప్రాయాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది.
Read Also : Anurag Kashyap: సెన్సార్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అనురాగ్ కశ్యప్..ఎందుకంటే?