LRS : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) రాయితీ గడువును పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. గత నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. మొదట మార్చి 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం మేర రాయితీ ప్రకటించారు.

ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు
అయితే ఈ గడువు ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా ఆశించినంత మేర రిజిస్ట్రేషన్లు జరగలేదు. ప్రజల నుంచి ప్రభుత్వం అనుకున్న మేర స్పందన కూడా రాలేదు. దీనిలో భాగంగానే.. మరో సారి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించింది.
4 లక్షల మంది దరఖాస్తుదారులు
ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. పథకం అమలు తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీనిని అధికారులు పరష్కరించేలోపే గడువు తేదీ సమీపించింది. దీంతో వరుసగా ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో చివరి రెండు రోజులు కార్యకలాపాలు సాగలేదు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తడంతో.. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఓటీఎస్ను మరో నెల రోజులు పొడిగించింది.