న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ..భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే.. ఆ దేశం ఆందోళన చెంది సుంకాలను తగ్గించడానికి అంగీకరించిందని పేర్కొన్నారు.అయితే ఈ విషయంపై భారత అధికారిక వర్గాలు మాత్రం ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతునట్లు సమాచారం. సుంకాల తగ్గింపునకు చర్యలు నిజమే అయినప్పటికీ.. ఆయన ఆరోపణలతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.

యూకేతోనూ పలు ఒప్పందాల కోసం చర్చలు
గతంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో భారత్ వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై సుంకాలను తగ్గించింది. ప్రస్తుతం ఐరోపా సమాఖ్య, యూకేతోనూ పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి వీటిని తగ్గించాలని న్యూఢిల్లీ నిర్ణయం తీసుకుంది. అంతే కానీ, అమెరికా భారత్పై విధించనున్న సుంకాల అమలుకు సమయం దగ్గరపడుతున్నందుకు కాదు అని భారత అధికారులు చెబుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దాదాపు అన్ని వస్తువులపై సుంకాలు
వ్యవసాయ ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని వస్తువులపై సుంకాలను తొలగించాలని అమెరికా భారత్ను కోరింది. న్యూఢిల్లీకి వాషింగ్టన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా 2030 నాటికి దీనిని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తోంది. గత నెల ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో 2025 చివరి నాటికి.. ఇరుదేశాల మధ్య పరస్పరం ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలిదశపై చర్చలు జరపడానికి ట్రంప్ అంగీకరించారు.