‘ఇండియాస్ గాట్ టాలెంట్ (IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..? మీ మెదడులోని చెత్తనంతా ఆ ప్రోగ్రామ్ ద్వారా బయట పెట్టారు. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా..? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి” అని సుప్రీం ప్రశ్నించింది. ఆ తర్వాత ఊరట కల్పించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణ్వీర్ను హెచ్చరించింది. అలాగే యూట్యూబర్ తన పాస్ పోర్టును మహారాష్ట్రలోని ఠాణె పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చిచెప్పింది.

పార్లమెంటులోను తీవ్ర నిరసనలు
అసలేం జరిగిందంటే.. ఐజీఎల్ లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సమయ్ రైనా షోలో రణ్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఎఆర్ లు నమోదయ్యాయి. వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఎఆర్ లు అన్నింటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్లో పేర్కొన్నాడు. దానిపైనే తాజాగా విచారణ జరిగింది.
రణ్వీర్ కు పెరుగుతున్న బెదిరింపులు
ఇటీవలే సుప్రీంకోర్టు సీజేఐ బాధ్యతల నుంచి రిటైరైన జస్టిస్ డీవై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్.. రణ్వీర్ తరపున వాదనలు వినిపించారు. నైతిక విలువల ప్రకారం తన క్లైంట్ వ్యాఖ్యలు సమర్థించనని, అయితే అతడిని హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని కోర్టుకు వెల్లడించారు. ఆ సమయంలో మహారాష్ట్ర, అస్సాం పోలీసులను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది. అలాగే అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా..? అని ఈసందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించింది.