Panchatantra: ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Read Time:  1 min
Panchatantra
Panchatantra
FONT SIZE
GET APP

Panchatantra: పంచతంత్ర కథలు భారతీయ సాహిత్యంలో ప్రసిద్ధమైన నీతి కథల సంకలనం, ఇవి సంస్కృతంలో విష్ణుశర్మ అనే పండితుడు రచించినవిగా పేర్కొన్నారు. క్రీ.పూ.3వ శతాబ్దంలో ఈ కథలు ఐదు” భాగాలుగా విభజించబడ్డాయి.

అందుకే ‘పంచతంత్రం’ (ఐదు వ్యూహాలు) అని పేరు. మిత్రలాభం (స్నేవా లాభం), మిత్రభేదం (స్నేహ విచ్ఛిన్నం), కాకోలూకీయం (కాకులు గుడ్లగూబల మధ్య యుద్ధం), లబ్ధప్రణాశం (అందినది. కోల్పోవడం), ఆపరీక్షిత కారకం(పరీక్షించని చర్యలు), ఇత్యాది భాగాలుగా విభజించారు.

ఈ కథలు బంతువులను పాత్రలుగా చిత్రీకరిస్తూ నీతి, రాజనీతి, జీవన విజ్ఞానం, మానవ స్వభావంపై భోధనలు అందిస్తాయి. ప్రతి కథలో ఒక నీతి దాగి ఉంటుంది. ఇవి రాజులకు సామాన్యులకు సమానంగా ఉపయోగపడతాయి ఉదా: ‘సింహం, ఎలుక’ కథలో చిన్నవారి సహాయం కూడా విలువైందని తెలుస్తుంది.

Panchatantra: పంచతంత్ర కథల నేపథ్యం

ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించిన గొప్ప రచనలలో ఒకటి పంచతంత్ర (Panchatantra) కథలు, విష్ణుశర్మ అనే గురువు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంథాన్ని ప్రపంచంలోని అనేక భాషల్లో అనువదించారు. ఈ కథలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. చిన్నచిన్న కథలు, ఆసక్తికరమైన కథనాలు, చక్కటి నీతితో విష్ణుశర్మ పంచతంత్ర కథలను సంస్కృతంలో బోధించారు. పంచతంత్ర కథల వెనుక చిన్నపాటి చరిత్ర ప్రచారంలో ఉంది.

దక్షిణ భారతంలో మహిళారూప్యమనే నగరాన్ని అమరశక్తి అనే మహారాజు పరిపాలించాడు. అతడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తూ అందరి ప్రశంసలందుకున్నాడు. అమరశక్తి మహారాజు చాలా శక్తిమంతుడు, దయాగుణం కలిగిన వ్యక్తి. రాజకీయ చతురత తెలిసిన మహోన్నతుడు. ఇతనికి ముగ్గురు కుమారులు. వారి పేర్లు బహుశక్తి ఉ గ్రశక్తి, అనంతశక్తి. వీరు అల్లరి చిల్లరిగా ఉండటంతో చదువు అబ్బకపోగా మూర్ఖుల్లా తయారయ్యారు. మహారాజు కుమారులకు చదువు చెప్పడం తనవల్ల కాదని రాజగురువు తేల్చి చెప్పేశారు. పిల్లల విషయంలో ఎంతో దిగులు పడుతున్న అమరశక్తి మహారాజుకు రాజ్యం శివార్లలో చిట్టడివిలో ఆశ్రమం ఏర్పరచుకుని నివసిస్తున్న విష్ణుశర్మ గురించి తెలిసింది.

ఒకరోజు తన ముగ్గురు కుమారులను తీసుకుని విష్ణుశర్మ ఆశ్రమానికి వెళ్లాడు అమరశక్తి. తేజస్సుతో వెలిగిపోతున్న విష్ణుశర్మను చూడగానే మహారాజు కుమారులు ముగ్గురూ అతని కాళ్లకు నమస్కరించారు.

“గురువర్మా! నా కుమారులకు విద్యాబుద్ధులు అబ్బకపోవడంతో మూర్ఖుల్లా తయారయ్యారు. వీరికి రాజనీతి, రాజతంత్రమే కాదు కనీసం సాధారణ జ్ఞానం కూడా లేదు. నా బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించి తీర్చిదిద్దవలసిందిగా “సవినయంగా కోరుతున్నాను” అని ప్రాధేయపడ్డాడు అనంతశక్తి. “మహారాజా! మీ బిడ్డలను అదు మాసాల్లో “చక్కగా తీర్చిదిద్దుతాను” అని విష్ణుశర్మ మాట ఇవ్వడంతో బిడ్డల్ని అక్కడే వదిలేసి మహారాజు రాజ్యానికి వెళ్ళిపోయాడు.

“నాయనలారా! ఈరోజు మీరు ఆడుతూ పాడుతూ గడపండి. రేపటి నుండి మీకు విద్యాబోధన చేస్తాను” అన్నాడు విష్ణుశర్మ. ఆ రోజంతా ముగ్గురూ సాయంత్రం వరకు అడుకుని అలసి, సొలసి అదమరచి నిద్రపోయారు. పొద్దున్నే నిద్ర లేవగానే స్నానపానాదులు కానిచ్చి గురువుగారి రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇంతలో గురువు విష్ణుశర్మ అక్కడికి వచ్చి వారితో “నాయనలారా! నేను మీరు కొన్ని కథలను చెబుతాను. ఇందులో పాత్రలన్నీ జంతువులే. అవన్నీ మనుషుల్లా మాట్లాడతాయి. కొన్నిచోట్ల మనుషుల పాత్రలు కూడా ఉంటాయి.

మిత్రుల విలువను నేర్పించే నీతి కథలు

Panchatantra: ఈ కథలను మీరు వింటే జీవిత సత్యాలు తెలుసుకుంటారు. వీటిని ‘పంచతంత్ర కథలు’ అంటారు. పంచ అంటే అయిదు, తంత్ర అంటే ఉపాయం అని అర్థం. అంటే అయిదు ఉపాయాలు అన్నమాట. వీటిలో మొదటి భాగం మిత్రలాభం, దీన్ని మిత్రుల వలన లాభం అంటారు. ఇందులో మంచి మిత్రులను ఎలా సంపాదించుకోవాలి. ఆపద సమయాలలో వారికి ఉపకారం చేయడం మంచి వారిని మిత్రులుగా చేసుకోవడం మొదలైన విషయాలపై కథలు ఉంటాయి. మంచి మిత్రులు ఆపద సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. రెండవ భాగం మిత్రభేదం. మిత్రులని విడదీయటం. మిత్రుల మధ్య విభేదాలు, మంచి మిత్రులను సంపాదించుకోవడమే కాదు, చుట్టుపక్కలున్న శత్రువులను గమనించి వారి బలాన్ని అణచివేయాలి. వారి నుండి ప్రమాదం జరగకుండా మనల్ని మనం కాపాడుకోగలిగే కథలు ఇందులో ఉంటాయి.

Panchatantra

రాజనేవాడు సమయానుకూలంగా వ్యవహరించి, అవసరమైతే కాపాడటానికి, శత్రువుల నుండి వారిని రక్షించేందుకు సింహాసనాన్ని కాపాడుకునేందుకు తన శత్రువుల మధ్య మిత్రభేదం కల్పించి తాను లాభపడాలి. మూడవ విభాగంలో కాకోలూకీయం. దీనికి మరొక పేరు విగ్రహం, ఏమాత్రం పరిచయం లేని ఇద్దరి మధ్య శత్రుత్వం కల్పిస్తే దాన్నే విగ్రహం అంటారు. బలమైన శత్రువున ఓడించే పథకాలు, యుద్ధం- శాంతి ఇత్యాదివి ఈ కథల్లో ఉంటాయి.

దుష్టుల నుండి ఆపదలు కలిగినప్పుడు అందులోనే తంత్రాలను పాటించి ప్రజలతో పాటు రాజ్యాన్ని కూడా కాపాడుకోవాలి. నాల్గవ విభాగాన్ని లబ్ధ ప్రణాశం, లబ్ధ నాశనం అంటారు. దీనికి మరొక పేరు సంధి. బలవంతులతో స్నేహం చేస్తూ లాభపడటమే సంధి అంటారు. సంపదను కోల్పోవడం, ఏ నష్టమూ లేకుండా ప్రమాదాల్లో పడటం, ఇతరులను తెలివిగా ఉపయోగించుకుని లబ్ది పొందినవాళ్లు మూర్ఖత్వంతో దానిని ఉపయోగించుకోలేకపోయిన వారి కథలు దీనిలోకి వస్తాయి.

మనుషులైనా, జంతువులైనా సరే తన కంటే బలవంతుడు తారసపడినప్పుడు సంధి చేసుకోవడం ఉత్తమం. అప్పుడు తనతో పాటు తన వారిని కూడా కాపాడుకోవడానికి వీలుంటుంది. మనతో సమానమైన వారితోనే యుద్ధం చేయాలి, మనకంటే తక్కువ వారిని ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. ఇటువంటి రాజనీతి నాల్గవ భాగంలో చేర్చుకోవచ్చు.

ఈ రాజనీతిని నేర్చుకుంటే సదా సుఖంగా జీవిస్తారు. అయిదవ విభాగం: అపరిక్షిత కారిత్వము, దీన్ని అసమీష్ కారిత్వం, అనాలోచిత కార్యాలు అని కూడా అంటారు. అనాలోచితంగా వచ్చే నష్టాలు, చెడు చేయకోరడం ఇత్యాదివి ఈ విభాగంలో ఉంటాయి.

మొదటి నాలుగు భాగాలలో జంతువులు ప్రధాన పాత్రలు కాగా, అయిదవ విభాగంలో మానవులు ప్రధాన పాత్రలుగా ఉంటారు. ఈ అయిదు విభాగాలలోని కథలు మీరు తెలుసుకుంటే మానవ ధర్మ వ్యవస్థ, మానవుల మనస్తత్వం మొదలైనవి మీరు చక్కగా అవగతమవుతాయి. ఇందులోని నీతి సూత్రాలను పాటించినవాడే మంచి పాలకుడిగా ప్రసిద్ధి చెందుతాడు” అని సవివరంగా తెలియజేశాడు విష్ణుశర్మ.

ఈ అయిదు విభాగాలలో విష్ణుశర్మ అద్భుతమైన నీతి కథలను సంస్కృత భాషలో రచించారు. ఇవన్నీ కల్పిత కథలే అయినప్పటికి అద్భుతంగా ఉంటాయి. ఈ కథల్లో జంతువులపాత్రలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో ప్రతి భాగంలో ప్రధాన కథను కలిగి ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రకు కథ చెబుతున్నట్లు చిన్న  చిన్న పిట్ట కథలు కూడా ఉంటాయి.అవివేకులైన ముగ్గురు రాకుమారులకు నీతిని బోధించే క్రమంలో ఈ కథలు సాగినప్పటికి నేటి తరం చిన్నారుల జీవన విధానాన్ని మార్చడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.

విష్ణుశర్మ సంస్కృత భాషలో రచించిన పంచతంత్ర కథలను ఎందరో తెలుగులోకి అనువదించారు. ముఖ్యంగా పరవస్తు చిన్నయసూరి, మొదటి రెండు భాగాలైన మిత్రలాభం, మిత్రభేదం కథలను మాత్రమే నీతి చంద్రిక పేరుతో తెనుగించారు. ఆ తరువాత ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారు మూడు, నాలుగు, అయిదు భాగాలైన కాకోలూకీయం (విగ్రహం), లబ్ది ప్రణాశం, లబ్ధనాశనం (సంధి), అపరక్షిత కారిత్వము, ఆసమీష్ కారిత్వం (అనాలోచిత కార్యాలు) కథలను తెనిగించారు. ఆ తరువాత బైచరాజు వేంకటనాథుడు దూబగుంట నారాయణ కవి, వేములపల్లి ఉమామహేశ్వరరావు మొదలైన వారంతా పంచతంత్ర కథలను తెలుగులోకి. అనువదించారు. ఈ పుస్తకాలు ప్రజల ప్రశంసలందుకున్నాయి. నేడు పంచతంత్ర కథల్లో అక్కడక్కడా కొన్ని కల్పిత కథలు కూడా కనిపిస్తున్నాయి. అన్నీ మంచినే ప్రబోధించడం వల్ల ప్రజాదరణకు నోచుకుంటున్నాయి.

Panchatantra: పంచతంత్ర కథలను ధారావాహికగా

తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. పిల్లలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగు పదాలతో కొన్ని సంవత్సరాల పాటు ఈ ధారావాహికను చందమామ మాసపత్రికలో ప్రచురించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం సంస్కృతంలో విష్ణుశర్మ రచించిన పంచతంత్ర కథలను నేడు ప్రపంచంలోని అనేక భాషల్లో అనువదించి ప్రచురించడం, టి.వి.లు, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ అందుబాటులోకి తేవడంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి.

జిత్తులమారి నక్క బలమైన సింహం, కపట బుద్ధికల పిల్లి, తెలివిలేని కొంగ, చతురత కలిగిన ఎద్దు ఇత్యాది అనేక జంతువులు, పక్షుల పాత్రలతో కొన్ని వందల సంవత్సరాల క్రితం రచించిన ఈ కథలు చదువుతుంటే అటువంటి పాత్రలు నేటికీ మన కళ్లముందు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

Panchatantra

జంతువులు, పక్షులతో పాటు కొన్ని భాగాలలో మనుషుల పాత్రలు కూడా తారసపడతాయి. జీవితంలో తెలివిగా ప్రవర్తించడం అనేది పంచతంత్ర కథల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కథలను పిల్లల చేత చదివించి వారికి అవగాహన కల్పించినట్లైతే వారిలో నైతిక విలువలు పెంపొంది భావిభారత ఉత్తమ పొదలుగా తయారౌతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పంచతంత్రంలో ఒక పాత్ర మరో పాత్రకు కథ చెబుతుంది.

ఒక కథలో మరో కథ కలసి ఉంటుంది. నేటి బాలబాలికలకు సైతం సునాయాసంగా పంచతంత్ర కథలు అర్థం కావాలని కొందరు రచయితలు సులభం శైలిలో ఏ కథకు ఆ కథను తమ పుస్తకాలలో అందించారు. ఇది వినోద విజ్ఞాన కథల భాండాగారం. పిల్లలతో పాటు పెద్దలను చైతన్య పరచాలనే ఉద్దేశంతో అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు. ఎంతో మంది రచయితలు పంచతంత్రం కథలను కొత్తదనంతో పుస్తక రూపంలో, దృశ్య మాధ్యమాల ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చారు.

Read Also: Moral Story : అబద్ధం చెప్పవద్దు

Madhavi

రచయిత గురించి

Madhavi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.