T20 WC 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజయంతో బోణీ కొట్టింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో అమెరికాపై భారత్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధశతకంతో జట్టును ఆదుకోగా, భారత బౌలర్లు సమష్టిగా రాణించి అమెరికాను కట్టడి చేశారు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టుకు శుభారంభం దక్కలేదు. మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ల ధాటికి తొలి దశలోనే మూడు వికెట్లు కోల్పోయింది. మిలింద్ కుమార్ (34), సూరజ్ కృష్ణమూర్తి (37), శుభమ్ రంజనే (37) పోరాడినప్పటికీ భారత బౌలర్ల పట్టు ముందు నిలవలేకపోయారు. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఫలితంగా అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది.
Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్లో తొలుత తడబడింది. అభిషేక్ శర్మ (0), ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) త్వరగా వెనుదిరిగారు. ఒకే ఓవర్లో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్ను అద్భుతంగా నిర్మించాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో అక్షర్ పటేల్ (14) సహకారంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈ గెలుపుతో టీమిండియా టోర్నీని విజయవంతంగా ప్రారంభించింది. భారత్ తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: