పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఇటీవల పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో సమావేశమవడం పాక్ రాజకీయ, రణనీతిగత వర్గాల్లో గణనీయ చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా పాల్గొనడం గమనార్హం. ఇస్లామాబాద్లోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఆపరేషన్ బన్యానమ్ మర్సూస్ – విజయోత్సవాల వేదికలో ఆఫ్రిది
ఈ సమావేశం పాకిస్థాన్ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ బన్యానమ్ మర్సూస్’ విజయాన్ని పురస్కరించుకొని జరిగింది. ఈ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లను ఆఫ్రిది, అక్తర్లు అభినందించినట్లు సమాచారం. ఈ సందర్భంగా షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ, పాకిస్థాన్ సైన్యం పనితీరును కొనియాడాడు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, శత్రువుకు గట్టి సమాధానం ఇచ్చారని ప్రశంసించాడు. ఆఫ్రిది వ్యాఖ్యలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి మద్దతుగా నిలవడమే కాకుండా, విజయ గర్జన పేరుతో ర్యాలీ నిర్వహించినందుకు ఆఫ్రిదీని ఆయన ప్రశంసించారు. అనంతరం, షాహిద్ ఆఫ్రిదీని ప్రధాని షరీఫ్ సత్కరించారు.
భారత వ్యతిరేక వ్యాఖ్యలు-ఆఫ్రిదీపై విమర్శల వర్షం
ఇక మరోవైపు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం షాహిద్ ఆఫ్రిది తన సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా భారతదేశంపై తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాస్పద పోస్టులు చేస్తూ వచ్చాడు. పాకిస్థాన్ సైన్యం భారత్పై విజయం సాధించిందంటూ కరాచీలో ఒక విక్టరీ ర్యాలీ కూడా నిర్వహించాడు. ఈ సందర్భంగా భారత సైన్యం మసీదులు, ప్రజలపై దాడులు చేస్తోందని, విదేశాల్లో సిక్కు కార్యకర్తలపై మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఆరోపించాడు. భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అధికారికంగా స్పందించలేదు. అయితే మిలిటరీ విశ్లేషకులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు మాత్రం ఆఫ్రిదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, భారత సైన్యం ఎప్పుడూ మతపరమైన గౌరవాలను కాపాడే విధానాన్నే అనుసరించిందని స్పష్టం చేస్తున్నారు.
Read also: Tom Curran : ‘భారత్-పాక్ ఉద్రిక్తతలతో ఏడ్చేసిన విదేశీ క్రికెటర్’ : టామ్ కరన్